- కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెపుదాం
- శ్రమ దోపిడీకి వ్యతిరేక పోరాటాలకు మేడే స్ఫూర్తి కావాలి
- ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : 141వ మేడే వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్యతో కలిసి ఆయన మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై పెరుగుతున్న ఒత్తిడులు, హక్కుల హరణ నేపథ్యంలో ఈ మేడే ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటోందని విమర్శిస్తూ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని చికాగోలో కార్మికుల పోరాట ఫలితంగా సాధించిన ఎనిమిది గంటల పని దినం సూత్రాన్ని కాపాడుకోవాలని సూచించారు.శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మేడే స్పూర్తిని అందరూ గుర్తుంచుకుని కార్మిక హక్కుల కోసం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి జి. నగేష్, జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, మర్రి కృష్ణ, పాషా తదితరులు పాల్గొన్నారు.

