ప్రజా గాయకుడు నాగేంద్రకు అండగా నిలిచిన దిశ విలేకరి బోడ అశోక్ నాయక్
ఫోటోగ్రాఫిక్ పరికరాల వితరణ
కారేపల్లి, ఆగస్టు 19 (వార్త సంధ్య): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా గాయకుడు నాగేంద్రబాబుకు దిశ విలేకరి బోడ అశోక్ నాయక్ అండగా నిలిచారు. ఆయనకు అవసరమైన ఫోటోగ్రఫీ పరికరాలను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా కారేపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నాగేంద్రబాబును అభినందించి ఘనంగా సన్మానించారు.
సీనియర్ జర్నలిస్టులు వార్త వెంకటేశ్వర్లు, సాక్షి పాలిక శ్రీనివాస్ చేతుల మీదుగా నాగేంద్రబాబుకు పరికరాలను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక దృశ్యాన్ని బంధించే కళ మాత్రమే కాదని, కాలాన్ని, చరిత్రను, మన జ్ఞాపకాలను భద్రపరిచే శక్తివంతమైన మాధ్యమమని అన్నారు.
ఒక్క ఫొటో ఎన్నో మాటలను చెప్పగలదని, సమాజంలో చోటుచేసుకునే అనేక కీలక ఘటనలకు ఫొటో శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా గాయకుడు నాగేంద్ర తన పాటల రచన, సంగీత సాధనకు వినియోగించుకునేందుకు అవసరమైన లైటింగ్ స్టాండ్, మౌత్ సంబంధిత పరికరాలను అందజేయడం అభినందనీయమని తెలిపారు.
కళాకారులను ప్రోత్సహించేందుకు జర్నలిస్టులు, సామాజిక సేవకులు ముందుకు రావడం అభినందనీయమని, నాగేంద్రబాబు తన కళ ద్వారా మరింత మంచి సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.

