హైదరాబాద్, ఏప్రిల్ 1 (వార్త సంధ్య):
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. మహిళా వేధింపుల కేసును లోక్ అదాలత్ ద్వారా ముగించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వివరాల ప్రకారం, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం. 363/2025లో పల్లపు రాంబాబు పై మహిళా వేధింపుల కేసు నమోదు అయింది. అనంతరం ఈ కేసు కాంప్రమైజ్ అయిన నేపథ్యంలో దాన్ని రంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ద్వారా క్లోజ్ చేయించేందుకు ఏఎస్సై బాలయ్య రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ విషయంపై బాధితుడు పల్లపు రాంబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అధికారులు ముందస్తుగా ట్రాప్ ఏర్పాటు చేశారు.కోర్టు ప్రాంగణంలోనే లంచం తీసుకుంటుండగా ఏఎస్సై బాలయ్యను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ ఘటనతో పోలీసు విభాగంలో మరోసారి అవినీతి అంశం వెలుగులోకి వచ్చింది.

