రూ.2.50 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 23 (వార్త సంధ్య) : పేద మరియు అవసరమైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య, ఆర్థిక సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మణుగూరు మండలం విట్టల్రావు నగర్కు చెందిన ఈర్ల ఉమారాణికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును అందజేశారు. అదేవిధంగా, పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన కోసూరి సుభాష్ చంద్ర మహారాజ్కు వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలబడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, వైద్య సహాయ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య చికిత్సలు మరియు అత్యవసర అవసరాల కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

