సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 10 (వార్త సంధ్య) : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కారేపల్లిలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమానికి డీవైఎఫ్ఐ సింగరేణి మండల కమిటీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ సింగరేణి మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చాయని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త బిల్లుల పేరుతో కూలీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోవడం అన్యాయమన్నారు. విద్యుత్ సవరణ చట్టాల ద్వారా రైతులు, పేదలపై అదనపు భారాలు మోపే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమించాలని వినయ్కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాదె నరేష్, చిలుముల భరత్, కాకాటి పృద్వి తదితరులు పాల్గొన్నారు.

