సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
పాల్వంచ ప్రతినిధి, ఆగస్టు 10 (వార్త సంధ్య) : అడవి, భూమి, ఆత్మగౌరవం కోసం గిరిజనులు సాగించిన వీరోచిత పోరాటాల స్ఫూర్తితో హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్రాస్ రోడ్లో ఉన్న విల్లుల వీరుడు కొమరం భీమ్ విగ్రహానికి సీపీఐ నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కొమరం భీమ్ చూపిన పోరాట స్ఫూర్తిని ఆదివాసీలు కొనసాగించాలని అన్నారు. గిరిజనుల హక్కులు, భూమి, అడవిపై హక్కులు, ఆత్మగౌరవం పరిరక్షణకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

