కామారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన మీడియా సమావేశం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 19 ( వార్త సంధ్య)
కామారెడ్డి: తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి నంగునూరి రవీందర్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్ఠం చేస్తామని తెలిపారు.
కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు సక్రమంగా జరగడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ రక్షణ సేన “పంచజన్యం” పేరుతో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని రవీందర్ గుప్తా తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు అరుణ్, మధు తదితరులు పాల్గొన్నారు.

