ఆపరేషన్ కవచ్లో భారీ విజయం.. ఐదు నాటు తుపాకులు స్వాధీనం, ఎనిమిది మంది అరెస్ట్

కామారెడ్డి జిల్లా పోలీసుల “ఆపరేషన్ కవచ్”లో భాగంగా జంతువులను అక్రమంగా వేటాడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు నాటు తుపాకులు, భారీగా వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీల సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారించినట్లు చెప్పారు. వారి వద్ద నాటు తుపాకులకు ఉపయోగించే వేట సామగ్రి లభ్యమవడంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా మొత్తం ఐదు నాటు తుపాకులు, గన్ పౌడర్, చాప్స్, పోటాష్, పెల్ట్స్, స్టీల్ చెర్రలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
దర్యాప్తులో బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ ఒక్కో నాటు తుపాకీని రూ.10 వేల చొప్పున విక్రయించినట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఈ కేసులో విస్లావత్ అరుణ్, విస్లావత్ గోపీచంద్, అన్గోత్ లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్ గణేష్, సాలావత్ చందర్, అన్గోత్ ధర్మా నాయక్, అస్లాం చావుస్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

