ఘనంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం 109 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
ఉస్మానియా యూనివర్సిటీ , ఏప్రిల్ 25 ( వార్త సంధ్య): ఏప్రిల్ 26 న ఠాగూర్ ఆడిటోరియం లో ఉస్మానియా విశ్వవిద్యాలయ 109 వ వ్యవస్థాపక వేడుకలను గతాన్ని స్మరిస్తూ, భవిష్యత్తుకు బాటలు వేస్తూ నినాదంతో ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు పౌండేషన్ డే వాక్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సజీవ చరిత్రలో మనం భాగస్వాములమంటూ, నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ సంస్థకు పునాది వేసిన హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దూరదృష్టికి రుణపడి ఉన్నామని, ఓయూ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవటం కేవలం ఒక్క రోజు వేడుక మాత్రమే కాదని తెలంగాణ రాష్ట్రానికి, ప్రపంచానికి ఉన్నత విద్యారంగంలో దిక్సూచిగా అత్యుత్తమ సేవలు అందించి , సమాజ శ్రేయస్సు కోసం పరిశోధనలు చేస్తూ, బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దుతున్న ఒక గొప్ప వారసత్వాన్ని గౌరవించుకోవడమని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులు, వాలంటీర్లు చేసిన ఫ్లాష్ మాబ్స్, మెడ్లీ డ్యాన్స్ ప్రదర్శనలు వేడుకల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ బి. లావణ్య , ప్రిన్సిపల్స్, డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, ఎన్సిసి , ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సహా దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు.

