దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 25(వార్త సంధ్య ) : దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సాల్వేరి అంజయ్యకు చెందిన ఆకారం రోడ్డులో ఉన్న నీలగిరి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగి తోట మొత్తం దగ్ధమైంది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సమీపంలోని ఇతర పంట పొలాలకు ప్రమాదం తప్పింది.అగ్నిప్రమాదం కారణంగా రైతుకు భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఈ ఘటనపై స్పందించిన ఫైర్ అధికారులు రైతులకు పలు జాగ్రత్తలు సూచించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున గడ్డి తగలబెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద అగ్నిప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు వాటిని గమనించాలని సూచించారు.పంటలు చేతికొచ్చే సమయంలో ఇలాంటి ఘటనలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొంటూ, పరిసరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

