- అశ్వాపురంలో ఉత్సాహంగా నిర్వహణ
- లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
- విప్లవ సిద్ధాంతాలపై నేతల ప్రాసంగాలు
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 22 (వార్త సంధ్య) : అశ్వాపురం మండలం సిపిఐ కార్యాలయంలో రష్యా విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ మండల కార్యదర్శి అంతనేని సురేష్, లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెనిన్ సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశగా విశ్లేషించి, 1917 అక్టోబర్ విప్లవంతో జార్ పాలనను కూలదోసి ప్రపంచానికి కొత్త దిశ చూపించిన మహా నాయకుడని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం, సామాజిక న్యాయం కోసం లెనిన్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంపై కూడా లెనిన్ ప్రభావం గణనీయమని, బాలగంగాధర తిలక్ నుండి భగత్ సింగ్ వరకు అనేక జాతీయ నాయకులు ఆయన సిద్ధాంతాలను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. లెనిన్ స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా పీడిత ప్రజలు ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఈనపల్లి పవన్ సాయి, అక్కనపల్లి నాగేంద్రబాబు, సిపిఐ మండల నాయకులు నారాయణ, రామ్మూర్తి, రఘు, రాము, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

