ఇందిరమ్మ ఇళ్ల నుంచి సీసీ రోడ్ల వరకు.. చండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చండ్రుగొండ, ఆగస్టు 18 (వార్త సంధ్య): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఉమ్మడి జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. సోమవారం చండ్రుగొండ మండలంలో వారు విస్తృతంగా పర్యటించి, మొత్తం రూ.2.23 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
మొదట కరిసెలబోడు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి ప్రారంభోత్సవం నిర్వహించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంకనంబరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
బాల్యతండలో పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించగా, రావికంపాడు, తిప్పనపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మహమ్మద్నగర్లో నిర్మించిన అంగన్వాడీ భవనం, ప్రహరీ గోడను ప్రారంభించారు. వంటిగుడిసె గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్పంప్ను ప్రారంభించారు. సీతయగూడెం గ్రామంలో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. మారుమూల గ్రామాలకు సైతం ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

