చుంచుపల్లి, జూలై 27 (వార్త సంధ్య) : చిన్నపాటి వర్షం కురిసినా చాలు… చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారుతోంది. రోడ్డు అంతా గుంతలు, బురదతో నిండిపోవడంతో గ్రామస్తులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు జారిపడి కిందపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వర్షపు నీరు రోడ్డు మీద నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, నడిచే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలో కనీసం ప్రయాణానికి అనువైన రోడ్డు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని చెబుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాంపురం గ్రామంలో నాణ్యమైన సీసీ రోడ్డు లేదా బీటీ రోడ్డు నిర్మించి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.
చిన్నపాటి వర్షానికే రోడ్డు అస్తవ్యస్తం… జారిపడ్డ చిన్నారులు
RELATED ARTICLES

