- నిషేధం ఉన్నా బహిరంగంగా గుట్కా విక్రయాలు
- ప్రభుత్వ ఆస్పత్రుల పరిసరాల్లోనే ఆరోగ్యానికి ముప్పు
- యువతను టార్గెట్గా చేసుకున్న అక్రమ వ్యాపారులు
- జిల్లాలో విస్తరిస్తున్న అక్రమ దందా!
- పన్నులు పెరిగినా తగ్గని గుట్కా దందా
- అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 30 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాన్ మసాలా, గుట్కా అక్రమ వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తూ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గుట్టు చప్పుడు లేకుండా సాగుతున్న ఈ దందా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుంచి సరైన చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
జిల్లాలో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా గుట్కా విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. నిషేధం ఉన్నప్పటికీ పలు దుకాణాల్లో రహస్యంగా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే, కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పరిసరాల్లోనే గుట్కా విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రదేశాల్లోనే ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు లభించడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా పాన్ మసాలా, గుట్కా, తంబాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం “హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్–2025”ను అమలు చేస్తున్నప్పటికీ, జిల్లాలో గుట్కా వ్యాపారం తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. పన్నులు పెరిగినా, నిషేధం ఉన్నప్పటికీ గుట్కా సులభంగా లభించడం వెనుక అక్రమ రవాణా, నిల్వలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
గుట్కా వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ అక్రమ వ్యాపారంపై సమగ్ర దాడులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు అప్రమత్తమై గుట్కా దందాను పూర్తిగా అరికట్టాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

