బడుగు బలహీన వర్గాల సాధికారతే లక్ష్యం
వనపర్తిలో యాత్ర ప్రారంభించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి
వనపర్తి, జూన్ 13 (వార్త సంధ్య):
నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి చేపట్టిన “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర” వనపర్తి నియోజకవర్గంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ శెట్టితో కలిసి ఎంపీ డాక్టర్ మల్లు రవి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు సహా బడుగు, బలహీన వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువల పరిరక్షణ, సామాజిక సమానత్వం సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ హక్కుల పట్ల అవగాహన పెంచుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రాజ్యాంగ హక్కులు, విద్యా అవకాశాలు, ఉపాధి పథకాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ బస్సు యాత్ర దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు.

