📰
సమాజ సేవే జర్నలిజం పరమావధి: టీజేఏ 12వ వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహణ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 24 (వార్త సంధ్య )

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలో ఎన్యూజే (ఐ) అనుబంధ టీజేఏ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా అధ్యక్షుడు సడక్ సునీల్ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అతిథి గృహంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేయడంతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్యూజే(ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, జర్నలిజం అనేది కేవలం వార్తలు రాయడం మాత్రమే కాకుండా సమాజానికి నిజాలను చేరవేయడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించడం జర్నలిస్టుల బాధ్యత అని అన్నారు. విద్యార్థులు నిజాయితీ, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ రాష్ట్ర, జిల్లా నాయకులు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, జిల్లా ఆసుపత్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాజ సేవతో పాటు బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

