🚨 బ్రేకింగ్ న్యూస్
ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్ నకిలీ.. కేసు నమోదు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 24(వార్త సంధ్య)
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్ను నకిలీ చేసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) డాక్టర్ చందరి సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదు ప్రకారం, జూలై 22న కొన్ని ధృవపత్రాలను పరిశీలించిన సమయంలో వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని, తన అధికారిక సీల్ను కూడా అనుమతి లేకుండా దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాలను సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం వినియోగించి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటన ప్రభుత్వ రికార్డుల విశ్వసనీయతతో పాటు వైద్యుని వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ సంతకాలు చేసిన వారు, అధికారిక సీల్ను దుర్వినియోగం చేసిన వారు మరియు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతరుల కోసం సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

