
కామారెడ్డిలో అక్రమ కట్టడాలపై బీజేపీ ఫైర్..!
- మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం – చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక
కామారెడ్డి: పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న, ఇప్పటికే నిర్మించిన భవనాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్లు కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 1 (వార్త సంధ్య )
బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, పట్టణంలో డివియేషన్ అనుమతులు లేకుండా, సెల్లార్ అనుమతి లేకుండా, పార్కింగ్ సదుపాయం కల్పించకుండా, నాలాలపై కూడా భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారుల సహకారంతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే అధికారులు లేదా రాజకీయ నాయకుల మాటలు నమ్మి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన యజమానులు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

