జూన్ 27 (వార్త సంధ్య) : నేడు ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉపాధి కల్పనలో, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో, పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్న పరిశ్రమలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా అమలులో ఉన్న 45 రోజుల చెల్లింపు నిబంధన గురించి అవగాహన కల్పించారు. లిఖితపూర్వక ఒప్పందం ఉంటే కొనుగోలుదారులు 45 రోజులలోపు, అలాంటి ఒప్పందం లేకపోతే 15 రోజులలోపు చెల్లింపులు చేయాలని సూచించారు. ఈ గడువును పాటించకపోతే, చెల్లించని మొత్తానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు వర్తించదని వివరించారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

