బ్రేకింగ్ న్యూస్
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై కాంగ్రెస్ శ్రేణులకు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కీలక సూచనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 26 ( వార్తా సంధ్య )
భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs)కు పిలుపునిచ్చారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన యువతను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని, ఓటరు వివరాల్లోని పేరు, వయస్సు, చిరునామా తదితర తప్పులను సరిచేయించాలని సూచించారు. అలాగే మరణించినవారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ప్రతి బూత్ పరిధిలో బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండటం ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని పేర్కొన్న ఏలే మల్లికార్జున్, కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి పోలింగ్ బూత్లో కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పనిచేసి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

