భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య) :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, విధుల నిర్వహణ తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.
అలాగే పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాలు, కాలనీలు, ప్రధాన కూడళ్ల వద్ద నిఘా పెంచి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడంతో పాటు బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకన్న బాబు, బత్తుల సత్యనారాయణ, రాజేందర్, సోమేశ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

