అదుపులో 5 గురు పేకాటరాయుళ్లు
రూ.6,800 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం
చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కవిత హెచ్చరిక
ఖమ్మం జిల్లా బ్యూరో, మే 20 (వార్త సంధ్య) : వేంసూరు మండలం కుంచపర్తి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వేంసూర్ ఎస్సై కవిత తెలిపారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు వేంసూరు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మండల పరిధిలో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కుంచపర్తి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గుంపులుగా చేరి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై కవిత ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను గమనించిన కొందరు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,800 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాలు, శివారు ప్రాంతాల్లో పేకాట, మద్యం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇటువంటి వ్యవహారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై కవిత హెచ్చరించారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

