సేఫ్టీ సూచికలు లేక వాహనదారులకు ముప్పు !
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):
సుజాతనగర్ మండలం పరిధిలోని కోయగూడెం గ్రామపంచాయతీ నుంచి సర్వారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ప్రమాదకర మలుపు వాహనదారులకు తీవ్ర ప్రమాదంగా మారుతోంది. ఈ మలుపు వద్ద ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొంది.
ప్రత్యేకంగా ఈ మలుపు చాలా కఠినంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అయితే ఇక్కడ హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, క్యాట్ ఐస్, స్పీడ్ బ్రేకర్లు వంటి ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాత్రి వేళల్లో లైటింగ్ సదుపాయం కూడా తక్కువగా ఉండటంతో డ్రైవర్లు మలుపును ముందుగానే గుర్తించడం కష్టంగా మారుతోంది. వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిల్వ ఉండడం, మట్టి చేరడం వల్ల వాహనాలు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం మరింత పెరుగుతోంది.
ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు పెద్ద ప్రాణనష్టం జరగకపోయినా, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎప్పుడైనా తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఈ ప్రమాదకర మలుపు వద్ద అవసరమైన భద్రతా చర్యలు వెంటనే చేపట్టి, వాహనదారుల ప్రాణాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

