- అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలం
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 28 (వార్త సంధ్య) : సుజాతనగర్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
వ్యవసాయాధారిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తూకంలో ఎలాంటి తేడాలు లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా నివారించి, రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేయాలని పేర్కొన్నారు.కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే రైతు సంక్షేమమే కీలకమని ఆయన అన్నారు.ఎర్రజెండా పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని, ప్రభుత్వం నుండి రైతులకు రావాల్సిన ప్రతి పైసాను అందించే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

