కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 24 (వార్త సంధ్య):కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట తండా శివారులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అడవిలో కట్టెల కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.శుక్రవారం ఉదయం స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు (45) తన భార్యతో కలిసి అడవికి కట్టెల కోసం వెళ్లారు. కట్టెలు కొట్టుకుని పక్కనపెట్టిన తర్వాత కొన్ని కట్టలను రోడ్డుకు తీసుకెళ్లి వస్తానని భార్య అక్కడి నుంచి వెళ్లింది. ఈ సమయంలో అడవిలో ఒంటరిగా ఉన్న మత్తుపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది.
అదే సమయంలో సమీపంలో బీడీ ఆకులు సేకరిస్తున్న వారు గమనించి గట్టిగా అరిచడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. అయితే అప్పటికే మత్తు తీవ్ర గాయాలపాలయ్యాడు.
గాయపడిన మత్తును వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
- గ్రామస్తుల్లో భయం
ఈ ఘటనతో స్థానిక గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అడవికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


