- ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా సైక్లింగ్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధిజూన్ 7 ( వార్తా సంధ్య)
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలో ఆదివారం నిర్వహించిన “హరిత భవిష్యత్తు కోసం సైక్లింగ్” అనే ఇతివృత్తంతో కూడిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ సైక్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు.
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సైక్లింగ్ను ప్రజల్లో ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా కాలుష్య నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజంతో పాటు పచ్చని పర్యావరణ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు మరియు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఉత్సాహంగా సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, క్రీడా సంఘాల సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యానికి సైక్లింగ్ – పర్యావరణానికి రక్షణ” అనే సందేశంతో ఫిట్ ఇండియా సైక్లింగ్ ర్యాలీ విజయవంతంగా కొనసాగింది.

