హుస్నాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సమావేశంలో ప్రధానంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, వర్షాకాలానికి ముందస్తు సన్నాహక చర్యలపై విస్తృతంగా చర్చించారు. గతంలో భారీ వర్షాల సమయంలో పలు కాలనీల్లో ఎదురైన నీటి నిల్వ, డ్రైనేజీ సమస్యలు మళ్లీ తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతి, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణంలో కొనసాగుతున్న ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ప్రజలకు నాణ్యమైన సేవలు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తరి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

