- సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరిన కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ
కొత్తగూడెం, జూన్ 06 (వార్త సంధ్య) :
రామవరం – కొత్తగూడెం ను అనుసంధానించే జాతీయ రహదారి-30పై ఉన్న గోధుమ వాగు బ్రిడ్జి దుస్థితిని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ తెలిపారు.
చిన్నపాటి వర్షం కురిసినా బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలువురు ద్విచక్ర వాహనదారులు గుంతల కారణంగా కిందపడి గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె ఎంపీకి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ సమస్యకు తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి వర్షాకాలం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలోపు అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
గోధుమ వాగు బ్రిడ్జి సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

