స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏరోస్పేస్ రంగానికి నైపుణ్య మానవ వనరులు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (వార్త సంధ్య): స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్గా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను ఈ యూనివర్సిటీ ద్వారా అందించనున్నామని పేర్కొన్నారు.స్కిల్స్కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యమని అన్నారు. స్కిల్ యూనివర్సిటీని అత్యుత్తమ స్థాయికి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
మల్లేపల్లి ఏటీసీ సెంటర్ను అభివృద్ధి చేసి, ఐటీఐలను టాటా గ్రూప్ సహకారంతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATCs) మార్చుతున్నామని వివరించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్ను సవరించి, విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.విద్యా ప్రమాణాలను పెంపొందించడమే కాకుండా, మౌలిక సదుపాయాలను కూడా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం సుమారు రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సిఎం తెలిపారు.

