మునుగోడు (వార్త సంధ్య) – మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ సిబ్బందికి ఆదివారం గ్రామ సర్పంచ్ జీడిమడ్ల సైదులు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సైదులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత నిర్వహణ మరియు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి గ్రామపంచాయతీ సిబ్బందిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు వంటి పనుల్లో సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది జీడిమడ్ల రవి, ఎర్ర అరుణ, తాటికొండ నరసింహ, జీడిమడ్ల లక్ష్మణ్, వెంకులు వారిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అనిత, ఉప సర్పంచ్ పోలగోని అంజయ్య, వార్డ్ సభ్యులు బోయపల్లి కృష్ణయ్య గౌడ్, పంపాటి విజయ్ కుమార్, ఎంపల్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

