చుంచుపల్లి, జూలై 13 (వార్త సంధ్య): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసి, నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు జె. బాలు, వార్త సంధ్య విలేఖరి సంతోష్, ఆశా వర్కర్ భారతమ్మ, గ్రామ పెద్ద కృష్ణార్జున రావు పాల్గొని చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వారి ఎదుగుదల, పోషకాహార శోషణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన చిన్నారులందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు సమిష్టిగా బాధ్యత వహించాలని సూచించారు.

