- సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
- ఏసీబీ దాడులు అవినీతి తీవ్రతకు నిదర్శనం
- అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి:రామిడి శూరకర్ణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా బ్యూరో, మార్చి 17 (వార్త సంధ్య): బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి కేంద్రంగా మారిందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడి శూరకర్ణ రెడ్డి డిమాండ్ చేశారు.మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైనప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు కొన్ని సందర్భాల్లో అధికారులను పట్టుకొని జైలుకు పంపించినప్పటికీ, అవినీతి తగ్గలేదని విమర్శించారు. పట్టుబడిన అధికారులకు మళ్లీ ప్రమోషన్లు రావడం అవినీతి పెరగడానికి కారణమని ఆయన అన్నారు.
గత ఆరు సంవత్సరాలుగా కార్పొరేషన్ పరిధిలోని పార్కులు, ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, అక్రమ ఎల్ఆర్ఎస్లు, డోర్ నెంబర్లు, సాధారణ బడ్జెట్ నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. ఈ అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కలిసి కార్పొరేషన్లో అవినీతిలో పాలుపంచుకుంటున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన ఏసీబీ దాడులు అవినీతి తీవ్రతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అవినీతిలో పాలుపంచుకున్న అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామిడి శూరకర్ణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

