- పీవీకే–5 గనిలో వాల్ పోస్టర్ విడుదల
- కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం వైఫల్యమని ఆరోపణ
- ఈ నెల 17 నుంచి 30 వరకు ఆందోళనలకు పిలుపు
కొత్తగూడెం/సింగరేణి,(వార్త సంధ్య): సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ రోజు పీవీకే–5 గనిలో నిర్వహించిన కార్యక్రమంలో సమ్మెకు మద్దతుగా వాల్ పోస్టర్ను ఎఐటియుసి నాయకులు విడుదల చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కొన్ని కార్మిక సమస్యలను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించినప్పటికీ ఇప్పటి వరకు వాటి అమలుకు సంబంధించి ఎలాంటి సర్క్యులర్లు జారీ చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం వంటి అంశాలపై యాజమాన్యం స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా వాల్ పోస్టర్ను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అలాగే ఏప్రిల్లో జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. పీవీకే–5 గని కార్మికులు అధిక సంఖ్యలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని సింగరేణి సంస్థ మనుగడను కాపాడాలని ఎఐటియుసి నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి భూక్యా రమేష్, పిట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నాగేశ్వరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జ్ సాయి పవన్, రాంచందర్, సురేందర్ రెడ్డి, సంజీవ్, విక్రమ్, సుమన్, సంతానం, రామారావు, విజయ్, శ్రీను, శశి, భద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

