- ప్రేమ వివాహం అనంతరం దాంపత్య కలహాలు
- వేకువజామున దాడి చేసి పరారైన భర్త
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
జగిత్యాల జిల్లా బ్యూరో, మార్చి 17 (వార్త సంధ్య): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో గర్భవతిగా ఉన్న యువతిపై ఆమె భర్త కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్కు చెందిన వైష్ణవి (19) ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్లోనే నివాసముంటున్నారు.హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తుండగా, వైష్ణవి సోషల్ మీడియా వేదికలపై రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. గత కొద్దిరోజులుగా దంపతుల మధ్య వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం.మంగళవారం వేకువజామున సుమారు 4 గంటల సమయంలో హరిబాబు, వైష్ణవిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం కుటుంబ సభ్యులు గమనించగా వైష్ణవి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

