- భూ కొలతలు నిలిచిపోవడంతో పెరుగుతున్న వివాదాలు
- ఇంచార్జి సర్వేయర్ అందుబాటులో లేక సమస్యలు తీవ్రం
- శాశ్వత సర్వేయర్ నియామకానికి సర్పంచ్ విజ్ఞప్తి
సారంగాపూర్ మండలం, మార్చి 17 (వార్త సంధ్య): జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో సర్వేయర్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేచపల్లి గ్రామ సర్పంచ్ బాస మహేష్ తెలిపారు. భూముల కొలతలు సక్రమంగా జరగకపోవడంతో భూ వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం మండలానికి ఇంచార్జి సర్వేయర్ ఉన్నప్పటికీ, ఆయన తరచుగా అందుబాటులో లేకపోవడంతో పెండింగ్లో ఉన్న భూ కొలతలు పూర్తికావడం లేదని చెప్పారు. దీని వల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భూ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంకా పరిష్కారం లభించలేదని తెలిపారు.అందువల్ల సారంగాపూర్ మండలానికి శాశ్వత సర్వేయర్ను వెంటనే నియమించి, పెండింగ్లో ఉన్న భూ కొలతలను పూర్తి చేసి రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సర్పంచ్ బాస మహేష్ జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు.

