Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 9:45 am Posted by : VARTHA SANDHYA DESK

భార్య చేతిలో భర్త హతం

🔹 చిన్న గొడవే ప్రాణాంతకంగా మారింది

🔹 నిందితురాలు పోలీస్ అదుపులో

🔹 గోసంగి కాలనీలో విషాద ఘటన

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 26 (వార్త సంధ్య):

కామారెడ్డి పట్టణంలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి కుటుంబ గొడవ ప్రాణాంతకంగా మారి, భార్య తన భర్తను హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని గోసంగి కాలనీలో నివాసం ఉంటున్న కోదండ శివజీ (31) రాత్రి సమయంలో ఇంట్లో భోజనం చేస్తుండగా, అతని భార్య కోదండ లక్ష్మితో మాటల తగాదా జరిగింది. ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో, ఆగ్రహానికి లోనైన లక్ష్మి ఇంట్లో ఉన్న కొడవలితో శివజీ గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్థానికులను ప్రశ్నిస్తూ ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకుంటున్నారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు శివజీకి పిల్లలు ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనతో గోసంగి కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి దారితీసిన ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.