-
ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్
-
పోరాటం చేసిన విద్యార్థి నాయకులను కూడా గుర్తించాలని విజ్ఞప్తి
-
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఉద్యమకారుల ఫోరం
పెద్దపల్లి, మంథని, మార్చి 16 (వార్త సంధ్య): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని డివిజన్ కన్వీనర్ గోగుల రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ పేర్కొన్నారు.సోమవారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారందరినీ గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్, హెల్త్ కార్డులు మరియు ఉద్యమకారుడి ఐడి కార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం మరియు పెన్షన్ ఇవ్వాలని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ దిశగా కమిటీ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.అయితే కేవలం జైలుకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదైన వారినే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థి నాయకులు మరియు ఇతర ఉద్యమకారులను కూడా కమిటీ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కమిటీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, కేశవరావు, సీమ శ్రీనివాస్లకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున కృతజ్ఞతలు తెలిపారు.