వనస్థలిపురంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 (వార్త సంధ్య): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం చత్రపతి శివాజీ గ్రౌండ్లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలు, యువతకు క్రీడలు మరియు ఫిట్నెస్ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇవి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
పిల్లల్లో ప్రతిభ పెంపొందించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం, క్రమశిక్షణ మరియు టీమ్వర్క్ నేర్చుకోవడం వంటి అనేక ప్రయోజనాలు ఈ శిబిరాల ద్వారా లభిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో స్పోర్ట్స్ కెరీర్కు కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.తాను హుడా చైర్మన్గా ఉన్న సమయంలో ఈ ప్రదేశాన్ని పార్క్గా కాకుండా ప్లేగ్రౌండ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. గాయత్రి భవన్, డీపీఎస్ గ్రౌండ్, వనస్థలిపురం ఫేజ్-4, శివాజీ గ్రౌండ్స్ వంటి ఐదు ప్లేగ్రౌండ్స్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉండటం గర్వకారణమని, 8 నుండి 80 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు పార్కులు, ప్లేగ్రౌండ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. యువతకు ఆడుకునే ప్రదేశాలు లేకపోవడంతో వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.అనంతరం పలు పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, అధికారులు అశోక్, నాగేందర్, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు, కోచ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.