6వ సేవా కార్యక్రమంగా నారాయణ పూజ నిర్వహణ
కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):
శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6వ సేవా కార్యక్రమంగా నారాయణ పూజ నిర్వహిస్తూ, నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 1వ వార్డు అడ్లూరు గ్రామానికి చెందిన కుర్మ రవి ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అతని తల్లి కూడా మృతి చెందడంతో, రవి భార్య రమ్య మరియు వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలారు.
ఈ విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి రూ.9,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ట్రస్టులో సభ్యత్వం నమోదు చేసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ఐజూ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్, కోడిప్యాక సాయిరాం, 1వ వార్డు కౌన్సిలర్ మహేష్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీపతి, నారాయణరావు, డాకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.