- కేటగిరీ-బి పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష
- ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పని చేయాలని సూచన
రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 11 (వార్త సంధ్య): జిల్లాలో ఎఫ్-లైన్కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సహాయ సంచాలకులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (ఏడీ, ఎస్ఎల్ఆర్) ఆధ్వర్యంలో మండల సర్వేయర్లు, డీఐఓఎస్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎఫ్-లైన్కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల స్థితిని మండలాల వారీగా సమీక్షించిన అదనపు కలెక్టర్, సేవా హామీ చట్టం (SLA) గడువును దాటిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా కేటగిరీ-బి పరిధిలో ఉన్న పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సమీక్ష సమావేశం నాటికి పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఫిర్యాదులు లేదా ఆరోపణలకు తావులేకుండా పారదర్శకతతో పనిచేయాలని సూచించారు.
దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ సేవలను సకాలంలో ప్రజలకు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.సమావేశంలో రాంరెడ్డి, మండల సర్వేయర్లు, డీఐఓఎస్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.