- రూ.60 లక్షల లోన్ వ్యవహారంలో బాధితుడి ఆరోపణలు
- అధిక వడ్డీ, వేధింపులపై ఆవేదన వ్యక్తం
- సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ప్రకటన
హైదరాబాద్ సిటీ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): శ్రీరామ్ ఫైనాన్స్లో జరుగుతున్న మోసాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
భువనగిరిలోని శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా రూ.60 లక్షల లోన్ తీసుకున్నానని, అయితే తనకు రూ.57,47,666 చెక్కు రూపంలో ఇచ్చారని తెలిపారు. ఈ మొత్తానికి 60 నెలల పాటు చెల్లింపులు చేసినప్పటికీ, వడ్డీతో కలిపి మొత్తం రూ.1.09 కోట్ల వరకు చెల్లించాలని సంస్థ ఒత్తిడి తీసుకొస్తోందని ఆరోపించారు.ప్రస్తుతం కూడా రూ.62,39,744 చెల్లించాలని వేధిస్తున్నారని, అన్యాయంగా వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. లోన్ మంజూరు సమయంలో సంస్థ మేనేజర్ అంజిరెడ్డి రూ.3 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.అలాగే సంస్థకు చెందిన శ్రీనివాస్ రెడ్డి వేధింపుల కారణంగా తన గ్యారంటర్ సంతోష్ మరణించాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.