Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 5:39 pm Posted by : VARTHA SANDHYA DESK

ప్రతి పౌరుడు ఆర్.టి.ఐ చట్టాన్ని వినియోగించుకొని తన హక్కులను సాధించుకోవాలి: డాక్టర్ చంటి ముదిరాజ్

సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో శక్తివంతమైన ఆయుధం 

హైదరాబాద్, బషీర్‌బాగ్, వార్త సంధ్య: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ సహాయ కార్యదర్శిగా అన్నవరం సందీప్ రెడ్డి నియామకాన్ని పురస్కరించుకుని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005 ప్రజలకు పారదర్శక పాలనను అందించే అత్యంత కీలకమైన చట్టమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, అధికారులు, సంస్థల పనితీరుపై సమాచారం తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుందని తెలిపారు. అవినీతి, అక్రమాలు, ప్రజా ధన దుర్వినియోగం వంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో ఆర్.టి.ఐ చట్టం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడు ఈ చట్టంపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు.

రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి మాట్లాడుతూ యువత, సామాజిక కార్యకర్తలు సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. నూతన జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని, దేశవ్యాప్తంగా కమిటీల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్, రాష్ట్ర కార్యదర్శులు అజయ్ కుమార్, నవీన్ కుమార్, సహాయ కార్యదర్శులు కార్తీక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అశోక్ కుమార్, అరవింద స్వామి, శివ కుమార్, బాపయ్య, మారుతి స్వామి తదితరులు పాల్గొన్నారు.