మే 5 నిరాహార దీక్షకు సన్నాహక సమావేశం
రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 28 (వార్త సంధ్య) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) మే 5న కలెక్టరేట్ కొంగరకలాన్లో నిర్వహించనున్న ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి సన్నాహక సమావేశం నాంపల్లి టీజీవో భవన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మే 5న జరగబోయే నిరాహార దీక్ష కార్యక్రమానికి నాయకత్వ బాధ్యతలను టీజీఓ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డా. కే. రామారావుకు అప్పగిస్తూ, ఆయనను జేఏసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15.25 లక్షల ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం, సీపీఎస్ రద్దు వంటి నాలుగు ప్రధాన డిమాండ్లతో పాటు మరో 64 పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేసింది.
ఈ సమావేశంలో టీఎన్జీఓ నాయకులు యశ్వంత్, శ్రీనివాస్, గోపాల్ నాయక్, రంగయ్య, పీఆర్టీయూ ప్రతినిధులు మహేందర్ రెడ్డి, ఎస్టీయూ నాయకుడు ప్రవీణ్ కుమార్, టీజీఓ నాయకులు శ్రీనేష్ కుమార్ నోరి, నూతన కంటి వెంకట్, టీఆర్టీఎఫ్ ప్రతినిధి ఎం. రమేష్, జీటీఏ నాయకుడు నరసింహ, టీజీఓ మహిళా నాయకులు రేవతి, శాంతిశ్రీ, అనిత, మహేశ్వరి, రాకేష్, మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.