Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 1:28 pm Posted by : VARTHA SANDHYA DESK

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి

  • తిరువూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు

  • తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడిన నాయకులు

  • రాజీవ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు


తిరువూరు, మార్చి 16 (వార్త సంధ్య): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరువూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన త్యాగం వల్లే దేశంలో మొట్టమొదటిసారిగా భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందని తెలిపారు. తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.భాషాప్రయుక్త రాష్ట్రాల పితామహుడిగా పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నాయకులు పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని తరతరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రకాశరావు, తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కొత్తగుండ్ల గోపాలకృష్ణ, ఇజ్జాడ జగన్నాథం, పర్వతం రామారావు, కె.ఎల్.రావు, చావుల రంగయ్య, కొంగల ఆదాం, గరికపాటి నరసింహారావు, దుగ్గిరాల జయరాజు తదితరులు పాల్గొన్నారు.