దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 27(వార్త సంధ్య ): దుబ్బాక మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో ఉపాధి హామీ పథకం (NREGS) పనుల్లో నిమగ్నమైన కూలీలకు 1వ వార్డు మెంబర్ షరీఫ్, 3వ వార్డు మెంబర్ కంకణాల రాజు ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ మరియు మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు.గ్రామంలో రైతులకు సాగు పనుల కోసం వెళ్లే మార్గాలను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం కింద గ్రావెల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఎండల నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలని, వారి దాహార్తిని తీర్చాలని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వార్డు మెంబర్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో కూలీల పాత్ర అత్యంత కీలకమని, ఎండలను లెక్కచేయకుండా పనుల్లో పాల్గొంటున్న కూలీల సౌకర్యార్థం ఈ చిన్న సహాయం అందించినట్లు చెప్పారు. రైతులకు సాగు మార్గాలు మెరుగుపడటంతో పాటు, కూలీలకు ఉపాధి కలగడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది పున్న నరేష్, కూలీలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తమ పట్ల శ్రద్ధ చూపి మజ్జిగ, మంచినీరు అందించిన వార్డు మెంబర్లకు కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.