Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 8:57 pm Posted by : జడల నాగప్రసాద్

వృద్ధురాలి పై కోతుల దాడి..…

  • తీవ్ర గాయాలు… ఆస్పత్రికి తరలింపు
  • కోతులు,కుక్కల బెడద పై ప్రజల ఆందోళన

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 01 (వార్త సంధ్య) : కొత్తగూడెం పట్టణంలోని రామవరం ప్రాంతంలో కోతుల దాడి కలకలం రేపింది. గిర్దారిలాల్ టెక్స్టైల్స్ షోరూమ్ వెనుక లైన్‌లో నివసిస్తున్న పోచమ్మ అనే వృద్ధురాలిపై కోతులు దాడి చేసి కరిచి గాయపరిచాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత కొంతకాలంగా కోతుల బెడద పెరుగుతోందని, ఇళ్లలోకి చొరబడి ఆహారం దోచుకోవడం, రోడ్లపై వెళ్తున్న వారిపై దాడులు చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా పట్టణంలో అల్లరి కుక్కల సమస్య కూడా రోజురోజుకీ తీవ్రమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించి కోతులు, కుక్కలను నియంత్రించే చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రజల భద్రత కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.