పనుల పురోగతి, వేతనాలు, సమస్యలపై ఆరా
కరీంనగర్, జూన్ 13 (వార్త సంధ్య): హుస్నాబాద్ నుంచి కరీంనగర్కు వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్గమధ్యంలో ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహిస్తున్న కూలీలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల పురోగతి, పనుల నిర్వహణ విధానం, వేతనాల చెల్లింపులు, పని పరిస్థితులు తదితర అంశాలపై కూలీలతో నేరుగా మాట్లాడారు. పనులు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించిన మంత్రి, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కూలీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కూలీల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని మంత్రి స్పష్టం చేశారు.