
ఎల్.బి.నగర్, మార్చి 19 (వార్త సంధ్య): ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. యూత్ కాంగ్రెస్ నాయకులు ‘డ్రగ్ టెస్ట్’ పేరిట ‘వైట్ ఛాలెంజ్’ ప్రకటించి అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లనీయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి, చిల్లర రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.సవాళ్లు విసిరిన తర్వాత వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక వెనక్కి తగ్గడం కాంగ్రెస్ నాయకుల వైఫల్యాన్ని చూపుతోందని అన్నారు. తాము శాంతియుతంగా డ్రగ్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నప్పటికీ, అధికార అహంకారంతో పోలీసు బలగాలను ఉపయోగించి అడ్డుకోవడం తగదని విమర్శించారు.ఎల్.బి.నగర్లో ఇంతవరకు లేని విధంగా ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సవాళ్లు విసిరిన తర్వాత కార్యకర్తలకు అండగా నిలవకపోవడం బాధాకరమని అన్నారు.
డ్రగ్ టెస్ట్కు సిద్ధం
ఎప్పుడైనా, ఎక్కడైనా డ్రగ్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తమ కార్యకర్తలపై పూర్తి విశ్వాసం ఉందని, వారికి ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పారు. డ్రగ్స్ సంస్కృతిని తమ పార్టీ ఎప్పటికీ ప్రోత్సహించదని తెలిపారు.అలాగే తమ పార్టీ నాయకుడు కేటీఆర్ పై చేసిన డ్రగ్స్ ఆరోపణలు కూడా నిరాధారమని, ఆయన కూడా ఎప్పుడైనా పరీక్షలకు సిద్ధంగా ఉన్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు స్పందించకుండా మౌనం వహిస్తున్నారని విమర్శించారు.యువత డ్రగ్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.