Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 4:43 pm Posted by : VARTHA SANDHYA DESK

‘జల వనిత’ ఆనందకు కలెక్టర్ సన్మానం

  • న్యూఢిల్లీలో జరిగిన జల్ మహోత్సవ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చెన్నంపల్లి మహిళ

  • తెలంగాణ నుంచి ఎంపికైన ప్రతినిధుల్లో ఒకరైన తెలగమల్ల ఆనంద

  • కొంగరకలాన్ ఐడీఓసీలో కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం


రంగారెడ్డి జిల్లా, మార్చి 16 (వార్త సంధ్య): రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ మండలం చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ‘జల వనిత’  తెలగమల్ల ఆనంద జల్ జీవన్ మిషన్ అమలులో చేసిన విశేష కృషికి గాను గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన జల్ మహోత్సవ్ ప్రచార కార్యక్రమం–2026లో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము మరియు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు.జల్ జీవన్ మిషన్ అమలులో గ్రామస్థాయిలో చేసిన సేవలను గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం ముగ్గురు మహిళా సర్పంచులు, ముగ్గురు ‘జల వనితలు’ మరియు ముగ్గురు స్వయం సహాయక బృందాల మహిళలను ఎంపిక చేశారు. ఆ ఎంపికైన ప్రతినిధుల్లో చెన్నంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి తెలగమల్ల ఆనంద ఒకరు కావడం విశేషం.

జల్ జీవన్ మిషన్ అమలులో ఆమె చేసిన కృషిని అభినందిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదివారం కొంగరకలాన్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లో ఆమెను ఘనంగా సన్మానించారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరచడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. తెలగమల్ల ఆనంద వంటి మహిళలు గ్రామాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.