కల్వకుర్తి,పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల పురోగతిపై సమీక్ష
పరిహారం, పునరావాసం, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశాలు
రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 12 (వార్త సంధ్య): సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ పునరావాసం, పునరుపాధి మరియు భూసేకరణ (R&R & LA) కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టరేట్కు విచ్చేసిన కమిషనర్కు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి అనంత్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సునీల్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం తదితర ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు.
భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆమనగల్లు, మాడ్గుల్ తహసీల్దార్లు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.